కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి సుబ్రతా ముఖర్జీ(75) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ముఖర్జీ మరణ వార్త తెలిసిన వెంటనే సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లారు. సుబ్రతా ముఖర్జీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. గత వారంలో తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో సుబ్రతా ముఖర్జీని ఐసీయూలోకి తరలించి చికిత్స అందించినట్టు ఆస్పత్రి వైద్య సిబ్బంది వెల్లడిరచారు. సుబ్రతా ముఖర్జీకి నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఇక్కడి రవీంద్ర సదన్లో రాజకీయాలకతీతంగా నాయకులు తరలివచ్చారు. వారిలో టీఎంసీ సీనియర్ నాయకులు ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిస్వాస్, కాంగ్రెస్కు చెందిన అబ్దుల్ మన్నన్, ప్రదీప్ భట్టాచార్య, అలాగే బీజేపీకి చెందిన దిలీప్ ఘోష్, రాహుల్ సిన్హా ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా, పార్టీ అధికార ప్రతినిధి సుజన్ చక్రవర్తి కూడా సుబ్రతా ముఖర్జీకి నివాళులర్పించారు.