కేంద్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం
కోవిడ్, శాంతిభద్రతలపై ఈసీ సమీక్ష
న్యూదిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అర్హులైన ప్రజలందరికీ టీకాలు వేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టంచేసింది. ఆ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, కరోనా తీవ్రత, శాంతిభద్రతలపై గురువారం కూలంకషంగా చర్చించింది. ప్రత్యేకించి కోవిడ్ విజృంభణ, తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య నిపుణులతో సమీక్షించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఆ రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లాతోనూ కేంద్ర ఎన్నికల కమిషన్ వేరుగా సమావేశమైంది. రెండు, మూడు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నది. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఉయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ అధికారి బలరామ్ భార్గవ పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారిపై ఎన్నికల కమిషన్ సమగ్రంగా సమీక్షించింది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వైద్య నిపుణుల నుంచి పూర్తిస్థాయి సమాచారం తీసుకుంది. అర్హులందరికీ టీకాల ప్రక్రియను పూర్తిచేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.