యూనిలీవర్ భారత అనుబంధ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ అప్రమత్తమైంది. డవ్, ట్రెసెమే తదితర డ్రై షాంపూలను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్ సైట్ లో నోటిఫై చేసింది. దీంతో భారత్ లో ఈ ఉత్పత్తులను వినియోగిస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. దీన్ని తొలగించే ప్రయత్నం చేసింది హిందుస్థాన్ యూనిలీవర్. బెంజీన్ అనే కెమికల్ ప్రమాదకర స్థాయిలో ఉండడంతో డ్రై షాంపూలను ఉపసంహరించుకుంటున్నట్టు యూనిలీవర్ వివరణగా ఉంది. భారత్ లో తాము అసలు డ్రై షాంపూలను తయారు చేయడం లేదని హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటన విడుదల చేసింది. ‘‘యూనిలీవర్ యూఎస్, కెనడాలో 2021 అక్టోబర్ ముందు తయారు చేసిన డ్రై షాంపూలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. పరీక్షల్లో వీటిల్లో బెంజీన్ స్థాయిలు పెరిగిపోయినట్టు తేలింది. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని స్వతంత్ర సర్వేలో వెల్లడైంది’’అని హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. కానీ, మనదేశంలో విక్రయిస్తున్న డవ్ యాంటీ డాండ్రఫ్ లిక్విడ్ షాంపూ ఇంగ్రేడియంట్స్ను ఓ సారి గమనించండి. అందులో బెంజీన్ సల్ఫోనేట్ కనిపిస్తుంది. కనుక తయారు చేసి ఆరు నెలలు దాటిన ఈ ఉత్పత్తులను ముందు జాగ్రత్తగా వాడకపోవడమే మంచిదని తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి పరీక్షలు అరుదుగానే జరుగుతాయి.