చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా దసరా ఉత్సవాల్లో చివరి రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తుంటారు. ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా చాలా ప్రాంతాల్లో దీనిని ఘనంగా నిర్వహించారు. అయితే ఛత్తీస్గఢ్లోని ధామ్తరిలో రావణుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం వివాదాస్పదం అయింది. ఎందుకంటే రావణుడి పది తలలు దహనం కాలేదు. దాంతో ధామ్తరి పౌర సంఘంలోని ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధామ్తరిలోని రామ్లీలా మైదానంలో అక్టోబర్ 5వ తేదీన జరిగిన దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో రావణుడి దిష్టిబొమ్మకు తలలు చెక్కుచెదరలేదు. మొండెం భాగం మాత్రం కాలిబూడిదైంది. ఈ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని స్థానిక పౌర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే రాక్షసుడి తలలు కాలకపోవడాన్ని వారు సీరియస్గా తీసుకున్నారు. రావణుడి దిష్టిబొమ్మను తయారు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గుమస్తా రాజేంద్ర యాదవ్ను సస్పెండ్ చేస్తూ ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. దసరా వేడుకల కోసం రావణుడి దిష్టిబొమ్మను తయారు చేయడంలో అసిస్టెంట్ గ్రేడ్-3 రాజేంద్ర యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంబంధిత ఉత్తర్వులో పేర్కొన్నారు.