ఈ-టికెట్ల బుకింగ్ విధానంలో సమూల మార్పులు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తత్కాల్ టికెట్లలో బల్క్ బుకింగ్ల పేరిట సాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీనిపై సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో కలసి రూపొందించిన నివేదికను రైల్వే శాఖకు ఐఆర్సీటీసీ సమర్పించింది. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఐఆర్సీటీసీ పోర్టల్లో సమూల సంస్కరణలు తీసుకువస్తూ.. అప్గ్రేడ్ చేయనున్నారు.
దారి మళ్లుతున్న 35 శాతం తత్కాల్ టికెట్లు..
రైల్వే శాఖ ఈ-టికెటింగ్ విధానంలో ప్రవేశపెట్టిన తత్కాల్ టికెట్లను కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఫేక్ ఐడీలతో అక్రమంగా బల్క్ బుకింగ్ చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ నియమించిన గ్రాంట్ థాంటన్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడైంది. తత్కాల్ కోటాలోని దాదాపు 35 శాతం టికెట్లు ఇలా దారిమళ్లుతున్నట్టు తేలింది. దీంతో బల్క్ బుకింగ్ల దందాకు అడ్డుకట్ట వేయాలని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఈ`టికెటింగ్ పోర్టల్లో సంస్కరణలు తీసుకువచ్చి అప్గ్రేడ్ చేయనుంది. అలాగే ఈ-టికెట్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐఆర్సీటీసీ పోర్టల్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది.