తిరువనంతపురం: తిరువనంతపురం విమానాశ్రయానికి స్వదేశీ ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. గడచిన ఆరు మాసాల్లోనే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. తిరువనంతపురం విమానాశ్రయం ద్వారా ప్రయాణికుల రాకపోకలు పెరగడంపై హర్షం ప్రకటించారు. గతేడాది అక్టోబరులో 60,145 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణం చేయగా ఏప్రిల్లో ఈ సంఖ్య 1.31 లక్షలకు చేరిందని అధికారిక ప్రకటన వెల్లడిరచింది. 2021 నవంబరులో 84,048 మంది ప్రయాణించగా డిసెంబరులో 1,04,771 మంది, ఈ ఏడాది జనవరిలో 67,019 మంది, ఫిబ్రవరిలో 54,094 మంది, మార్చిలో 97,633 మంది, ఏప్రిల్లో 1,31,274 మంది ప్రయాణించారని వివరించింది. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్జెట్, విస్తారా ఎయిర్లైన్స్ తిరువనంతపురం నుంచి కొచ్చి, కన్నూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనె, ముంబై, దుర్గాపూర్, న్యూదిల్లీలకు విమానాలు నడుపుతున్నాయి. ఇక్కడి నుంచి బెంగళూరుకు రద్దీ ఎక్కువుగా ఉంది. తర్వాత స్థానాల్లో చెన్నై, దిల్లీ, ముంబై నిలిచాయి. వారానికి 98 సర్వీసులు నడుపుతూ ఇండిగో ప్రథమ స్థానంలో నిలిచింది.