కొయంబత్తూరు : నకిలీ జర్నలిస్టులను గుర్తించేందుకు మద్రాసు హైకోర్టు ఆదేశంతో త్వరలో ప్రెస్కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రచార మంత్రి ఎంపీ స్వామినాథన్ బుధవారం తెలిపారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో 90 రోజుల్లోగా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఆగస్టులో గౌరవ కోర్టు ఆదేశించిందనీ, ఆ ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి విలేకరులకు తెలిపారు. జర్నలిస్టుల నుంచి వచ్చే సమస్యలను ఆ కౌన్సిల్ పరిష్కరిస్తుందని, హౌసింగ్ బోర్డు సహాయంతో జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు స్వామినాధన్ జిల్లా కలెక్టరేట్లో శాశ్వత ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అంతర్జాతీయ విపత్తులు, ప్రమాదాల నివారణ దినోత్సవం సందర్భంగా విపత్తు నిర్వహణలో ఉపయోగించే పరికరాలు, భద్రత గురించి సమీక్ష నిర్వహించారు. సీపీఎం ఎంపీ పీఆర్ నటరాజన్, జిల్లా కలెక్టర్ జీఎం సమీరన్, కార్పొరేషన్ కమిషనర్ రాజ్గోపాల్ సుంకర, సమాచారశాఖ డైరెక్టర్ జైశీలన్ తదితరులు పాల్గొన్నారు.