న్యూదిల్లీ: పంజాబ్లో ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతున్న సమయంలో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ తరుణంలో రాహుల్గాంధీ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిని త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యకర్తలను సంప్రదించిన అనంతరం ఈ ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. ఎవర్ని ప్రకటించినా చన్నీ, సిద్ధూ కలిసి పనిచేస్తామని వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు వెనక్కి తెస్తారు?
చైనా ఆర్మీ అధీనంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ యువకుడు మిరామ్ తరోన్ను సరిహద్దు ప్రాంతమైన వాచా దమాయ్ పాయింట్ వద్ద భారత్కు పీఎల్ఏ అప్పగించడం ఊరట కలిగిస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం అన్నారు. అయితే చైనా ఆక్రమించుకున్న భూమిని ఎప్పుడు తిరిగి తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ‘మిరామ్ తరోనా వెనక్కి వచ్చాడని తెలిసింది. అలాగే చైనా ఆక్రమించుకున్న భూమిని ఇండియా ఎప్పుడు వెనక్కి తెస్తుందో ప్రధాని చెప్పాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. 19 ఏళ్ల మిరామ్ను వెనక్కి రప్పించాలని ఈనెల 23న తాను చేసిన ట్వీట్ను తాజా ట్వీట్కు ఆయన జతచేశారు. ఆ సందర్భల్లో మిరామ్ జాడ తెలియకపోవడంపై రాహుల్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రభుత్వం అనేది ఉంటే మీ బాధ్యత మీరు చేయాలి. మిరామ్ తరోన్ను వెనక్కి రప్పించండి’ అని అన్నారు. ఈనెల 18న అప్పర్ సియాంగ్ జిల్లా జిదో గ్రామానికి చెందిన మిరామ్ తప్పిపోయి చైనా భూభాగంలోకి వెళ్లిపోయాడు. అతని జాడ కోసం పీఎల్ఏను భారత సైన్యం సంప్రదించడం, అతని ఆచూకీ చిక్కినట్టు పీఎల్ఏ ప్రకటించడం, భారత్ అభ్యర్థన మేరకు ఆ యువకుడిని సరిహద్దు ప్రాంతంలో గురువారం అప్పగించడంతో కథ సుఖాంతమైంది.