థాయ్లాండ్లో ఐటీ ఉద్యోగాల పేరుతో 300 మందికిపైగా భారతీయులను మాయన్మార్ ముఠాలు అపహరించి, బలవంతంగా సైబర్ నేరస్థులుగా మార్చినట్టు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కాల్-సెంటర్ కుంభకోణం, క్రిప్టోకరెన్సీ నేరాలకు పాల్పడుతోన్న అనుమానిత ఐటీ సంస్థలు థాయ్లాండ్లో డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల పేరుతో భారతీయ యువకులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సలహా ఇచ్చింది.థాయ్లాండ్లో ఐటీ ఉద్యోగాల పేరుతో ఇస్తున్న ప్రకటనలపై చాలా అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల కిందట విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కూడా సూచనలు చేశారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను అక్రమంగా మాయన్మార్కు తరలించి, అక్కడ చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన ఈ సలహా ఇచ్చారు. థాయ్లాండ్తో పాటు దుబాయ్లో లాభదాయకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలంటూ ఐటీలో నైపుణ్యం కలిగిన యువతను మోసగించడానికి సోషల్ మీడియాలో భారత ఏజెంట్ల ద్వారా ప్రకటనలు ఇస్తున్నాయని కేంద్రం తాజా సూచనల్లో పేర్కొంది. బాధితులను అక్రమంగా మాయన్మార్ సరిహద్దుల్లోకి తరలించి, అక్కడ భయానక పరిస్థితుల మధ్య బలవంతంగా పనిచేయించుకుంటున్నారని తెలిపింది. సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా వచ్చే నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయ యువత పడొద్దని సూచించింది.