ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం వల్ల కాంగ్రెస్లో ఎవరు లాభపడాలనుకున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై దర్యాప్తు కోసం జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. స్మృతి ఇరానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానికి భద్రత కల్పించడం ప్రోటోకాల్ అని, కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రోటోకాల్ను, భద్రతా చర్యలను ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ, ఎందుకు ఉల్లంఘించిందని ప్రశ్నించారు. ప్రధాన మంత్రికి భద్రతా లోపం జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎవరు లాభపడాలనుకున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.