న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల అమలు దిశగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే భారత్కు చెందిన వినరు ప్రకాశ్ను భారత్లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి (ఆర్జీఓ)గా ఆదివారం నియమించింది. ఈ మేరకు సంస్థ వెబ్సైట్లో ఆయన వివరాలు పొందుపరిచింది. అందులోని ఈమెయిల్ ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది. గత కొన్ని రోజులుగా నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని ఇటీవల దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ట్విట్టర్ తీరుపై దిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన కోర్టు.. ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించింది. అందుకు ఇటీవలే 8 వారాల గడువు కోరిన ట్విట్టర్ ఆలోపే ఆర్జీఓను నియమించింది.