అక్రమ కట్టడాల పేరిట బీజేపీ విధ్వంసకాండ
శోభాయాత్రపై రళ్లదాడి నెపంతో ముస్లింలపై కక్షసాధింపు
మైనారిటీ వర్గీయుల ఇళ్లు, దుకాణాలు కూల్చివేత
బంగ్లాదేశ్ చొరబాటుదారులుగా`దురాక్రమణదారులుగా ముద్ర
మరోమారు సుప్రీంకోర్టు జోక్యం : ప్రక్రియ నిలిపివేతకు ఆదేశాలు
న్యూదిల్లీ : బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు చేస్తోంది. విధ్వంసకర/నిరంకుశ పరిపాలనను సాగిస్తోంది. ‘బుల్డోజర్ న్యాయ్’ను సమర్థిస్తోంది. మైనారిటీలే లక్ష్యంగా అమానుషత్వానికి తెరతీస్తోంది. హిందూ మతపరమైన ప్రదర్శనలపై రాళ్లు రువ్వారన్న నెపంతో ముస్లిం కుటుంబాలకు నిలువ నీడలేకుండా చేస్తోంది. వారి ఇళ్లు, దుకాణాలను అక్రమ కట్టడాల పేరిట కూల్చివేస్తోంది. బుల్డోజర్ రాజకీయాలు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మొదలై మధ్యప్రదేశ్ మీదగా దిల్లీకి చేరుకున్నాయి. మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల నెపంతో కాషాయ పార్టీ గోల చేస్తోంది. దీనిని కొత్త రాజకీయ అస్త్రంగా మార్చింది. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కులమత రాజకీయాలకు కమలం దళం మరోసారి తెరతీసింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో విధ్వంసం తర్వాత దిల్లీలోని జహంగిర్పూరికి బుల్డోజర్లు చేరుకున్నాయి. మైనారిటీలపై కక్షసాధింపు చర్యలకు బీజేపీ పూనుకుంటొంది. ఇందుకోసం అధికారాన్ని దుర్వినియోగిస్తోంది. పేదల సాధికారత, ప్రజా సంక్షేమం అనే కీలక అంశాలను పక్కకు పెట్టి కేవలం మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని, దేశాన్ని ఏలేయాలని కలలు కంటోంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు అంటూ ముస్లింలపై ముద్ర వేయడమే కాకుండా వారు ఎన్డీఎంసీ భూమిని కబ్జా చేశారని, ఇప్పుడు సొంత అవసరాల కోసం స్థలాన్ని ఖాళీ చేయిస్తుంటే తప్పేమి ఉందంటూ బుకాయిస్తోంది. పేద ముస్లింలపై అరాచకాలకు సమర్థించుకుంటోంది. బుధవారం దిల్లీలోని జహంగిర్పురిలో ముస్లింల ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో తొక్కించింది. దీంతో చేతికి అందిన వరకు తమ సామన్లను కాపాడుకునే ప్రయత్నంలో స్థానిక ముస్లింలు ఉన్నారు. నిలువ నీడ లేకుండా తమ కుటుంబం ఏ సమయంలో రోడ్డున పడవలసి వస్తుందో అంటూ బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ముస్లింలను దేశంలో బతకనివ్వబోమని, వారికి భారతీయులుగా ఎలాంటి గుర్తింపులు లేకుండా చేస్తామని బీజేపీ
ఆర్ఎస్ఎస్ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన యాత్రపై రాళ్లు రువ్విన నెపంతో ముస్లింలను శిక్షించేందుకు కూల్చివేత చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర దిల్లీ అనడం చర్చకు దారితీసింది. అల్లరి పిల్లలకు శిక్ష తప్పదన్న ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జహంగిర్పురిలో హింస జరిగిన 72 గంటల తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులను, సాయుధ దళాలను మోహరించారు. ఎంసీడీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సైతం రంగంలో దిగి కూల్చివేత ప్రక్రియ సజావుగా సాగేలా బుల్డోజర్ డ్రైవ్ను కొనసాగిస్తుండటం గమనార్హం. తమకు కనీసం ముందస్తుగా నోటీసులు కూడా ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోమారు అధికారంలోకి వచ్చింది. బుల్డోజర్ ప్రచారమే ఆ పార్టీకి కలిసివచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో మిగతా ‘బీజేపీ’ రాష్ట్రాలు ఇదే పంథాను అనుసరించసాగాయి. మధ్యప్రదేశ్లో బుల్డోజర్లకు పనిచెప్పారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ‘బుల్డోజర్ మామ’ పదం వాడుకలోకి వచ్చింది. చౌహాన్ ప్రభుత్వం మొత్తం 16 ఇళ్లు, 29 దుకాణాలను కూల్చివేసింది. ఇవన్నీ అక్రమ కట్టడాలంటూ ఆరోపించింది. అంతేకాకుండా ఖర్గోనేలో రామనవమి ప్రదర్శనపై రాళ్లు రువ్వి రెచ్చగొట్టిన వారి ఇళ్లను, దుకాణాలను కూల్చివేసినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు దేశ రాజధానిలోకి బుల్డోజర్ అడుగు పెట్టింది. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో జహంగిర్పూరిలో అక్రమ కట్టడాల తొలగింపు ంండు రోజులు కొనసాగనుంది. హనుమాన్ జయంతి యాత్రపై రాళ్లు రువ్వి ఘర్షణకు కారణమైన వారి (ముస్లింలు) దుకాణాలు, ఇళ్లను బీజేపీ పాలిత ఎన్డీఎంసీ అధికారులు కూలగొట్టారు. జహంగిర్పురిలో అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, పారామిలటరీ పహారా నడుమ కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. ఎన్డీఎంసీ బీజేపీ అధికారంలో ఉంది. ఈ ప్రాంతంలో ఇటీవల మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింస జరిగింది. దీంతో మైనారిటీ వర్గంపై బీజేపీ వర్గాలు కక్షసాధింపునకు దిగాయి. వారి ఆస్తులను కూల్చేసే చర్యలు చేపట్టాయి. కూల్చివేత ప్రక్రియ క్రమంలో అవాంఛనీయ ఘటనల నివారణకు పోలీసు బలగాలను భారీగా మోహరించారు. మహిళా సాయుధ దళాన్ని సైతం రంగంలోకి దించారు.
బుల్డోజర్లకు ‘సుప్రీం’ బ్రేక్
బీజేపీ పాలకులు తాము అధికారంలో ఉన్న ప్రతిచోటా కూల్చివేతలకు పాల్పడుతున్న క్రమంలో సుప్రీంకోర్టు మరోమారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విచారణలు చేపట్టకుండా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న విధ్వంసకాండకు బ్రేక్ వేసింది. కూల్చివేతల ప్రక్రియకు అడ్డుకట్ట వేసింది. దిల్లీ, జహంగిర్పురిలో బీజేపీ నేతృత్వంలోని కార్పొరేషన్ వారు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీడీ) తక్షణమే కూల్చివేతలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంలో గురువారం విచారించనుంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. దీంతో కూల్చివేత ప్రక్రియను ఆపేసినట్లు ఎన్ఎంసీడీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నంత ఈ కేసును తాము విచారించమని దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ.
రాజ్యాంగంపై బుల్డోజర్ : బృందా కారత్
సీపీఎం నాయకురాలు బృందా కారత్ బుధవారం జహంగిర్పురిని సందర్శించారు. ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాథక్తోనూ భేటీ అయ్యారు. అక్కడ పరిస్థితులను సమీక్షించారు. రాజ్యాంగాన్ని బుల్డోజర్లతో బీజేపీ పాలకులు తొక్కించేస్తున్నారని విమర్శించారు. కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
మున్సిపల్ అధికారులపై ఆప్ సర్కార్ ఆగ్రహం
మున్సిపల్ అధికారులపై ఆప్ సర్కార్ మండిపడిరది. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేలా వ్యవహరించడాన్ని ఆక్షేపించింది. బీజేపీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి చర్యలను కట్టడి చేయాల్సిందిపోయి మరింతగా రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఏమిటని దుయ్యబట్టింది.