కోవిడ్ కఠిన ఆంక్షలకు డీడీఎంఏ యోచన
న్యూదిల్లీ : కోవిడ్`19 వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్డౌన్ విధించే నిర్ణయం ఏదీ తీసుకోలేదని దిల్లీ విపత్తు నిర్వహణ మండలి(డీడీఎంఏ) సోమవారం తెలిపింది. రెస్టారెంట్లలో కూర్చొని తినేటువంటి సౌకర్యంపై మరిన్ని పరిమితులు, మెట్రో రైళ్లు, బస్సుల్లో సీటింగ్ సామర్థ్యాన్ని తగ్గించే అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఏడీడీఎంఏ సమావేశానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. కరోనా వైరస్, దాని ఒమిక్రాన్ రకం కేసుల పెరుగుదలను నిరోధించేందుకు ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారికేసులు పెరుగుదలను నిరోధించేందుకు దిల్లలో విధించిన ఆంక్షలను జాతీయ రాజధాని ప్రాంతంలో కూడా విధించే విషయమై కూడా డీడీఎంఏ సమావేశంలో చర్చించారు. కాగా ప్రస్తుతం రెస్టారెంట్లలో కూర్చొని ఆహారం తినే సదుపాయానికి సంబంధించి వారి సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతానికి అనుమతించారు. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు 100 సీటింగ్ సామర్థ్యంతో నడుస్తున్నాయి. సీఎం కేజ్రీవాల్ ఆదివారం మాట్లాడుతూ దిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. అయితే లాక్డౌన్ విధించాలనే ప్రణాళిక ఏదీ లేదని తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించినట్లయితే లాక్డౌన్ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.