ఎన్టీపీసీ, డీవీసీలకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశం
న్యూదిల్లీ : దిల్లీ విద్యుత్ డిస్కమ్లకు అందుబాటులో ఉన్నంత విద్యుత్ను తమ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు ప్రకారం సరఫరా చేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ, డీవీసీ(దామోదర్ వ్యాలీ కార్పొరేషన్)లను విద్యుత్ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశించింది. రాష్ట్రాల ద్వారా కేంద్ర ఉత్పత్తి కేంద్రాలు కేటాయించని విద్యుత్ వినియోగానికి సంబంధించి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 11, 2021న మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. గత 10 రోజుల్లో దిల్లీ డిస్కమ్లకు అందించిన డిక్లేర్డ్ కెపాసిటీ(డీసీ)ని దృష్టిలో ఉంచుకుని దిల్లీకి విద్యుత్ సరఫరాను భద్రపరచడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 10, 2021న ఎన్టీపీసీ, డీవీసీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీపీసీ, డీవీసీ తమ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుండి సంబంధిత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కింద చేసిన కేటాయింపుల ప్రకారం దిల్లీ డిస్కమ్లకు నార్మటివ్ డిక్లేమ్డ్ కెపాసిటీ (డీసీ) అందించవచ్చని ఆదేశించింది. ఎన్టీపీసీ, డీవీసీ రెండూ దిల్లీ డిస్కమ్ల డిమాండ్ మేరకు దిల్లీకి విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాయని తెలిపింది. ఇదిలాఉండగా, దిల్లీలో విద్యుత్ కొరత లేదని కేంద్రం తెలిపింది. తమకు అందిన సమాచారం ప్రకారం దిల్లీ డిస్కమ్లు తగిన మొత్తంలో విద్యుత్ సరఫరా చేసినట్టు పేర్కొంది. ఆదివారం దిల్లీ గరిష్ఠ డిమాండ్ 4,536 మెగావాట్లుగా ఉందని తెలిపింది. గత రెండు వారాల్లో సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన వాస్తవపట్టీని కూడా విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ డిమాండ్కు తగిన సరఫరా జరిగినట్టు పేర్కొంది.