ముంబై : దాద్రా అండ్ నగర్ హవేలీ (ఎస్టీ) లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కాలాబెన్ దేల్కర్ విజయాన్ని శివసేన పార్టీ తన విజయంగా చూపడానికి ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శుక్రవారం పేర్కొన్నారు. ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర వెలుపల మొదటి లోక్సభ సీటును గెలుచుకున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రకటించిన తర్వాత తాను దేల్కర్ ఎన్నికల గుర్తును తనిఖీ చేసినట్లు చెప్పారు. ‘నేను ఆమె ఎన్నికల గుర్తును పరిశీలించాను. ఆమె శివసేన ఎన్నికలు గుర్తు విల్లు, బాణంతో కాకుండా ‘బ్యాట్స్మన్’ గుర్తుతో పోటీ చేసినట్లు తేలింది’ అని రాణే పేర్కొన్నారు.
శివసేనకు మరొకరి గెలుపును తమకు ఆపాదించుకోవడం అలవాటు.. వారు ఇప్పుడు దిల్లీని స్వాధీనం చేసుకుంటామని హాస్యాస్పదమైన ప్రకటనలు చేయడం ప్రారంభించారని రాణే విమర్శించారు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్లే 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56 సీట్లు గెలుచుకుందని రాణే అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఎనిమిది సీట్లకు మించి గెలవదని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో దేల్కర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి మహేశ్ గవిత్పై 51,269 ఓట్ల తేడాతో గెలుపొందారు.