వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేసిన ప్రతిపక్ష నాయకులు
న్యూదిల్లీ : హరిద్వార్లో ఇటీవల ‘ధర్మ సంసద్’లో ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం డిమాండ్ చేశారు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కూడా ముస్లింకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ‘ధర్మ సంసద్’లో ప్రసంగీకులు, నిర్వాహకులపై చర్యలకు డిమాండ్ చేశారు. హరిద్వార్ జిల్లాలోని జ్వాలాపూర్ పోలీసు స్టేషన్లో ఈ మేరకు ఆయన ఒక ఫిర్యాదు చేశారు. హరిద్వార్ సమ్మేళనంలో ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రియాంక తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఈ రకమైన ద్వేషాన్ని, హింసను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మన గౌరవనీయమైన మాజీ ప్రధానిని హత్య చేయడానికి, వివిధ వర్గాల ప్రజలపై హింసను ప్రేరేపించడానికి బహిరంగంగా పిలుపునిచ్చిన వారు తప్పించుకోవడం గర్హనీయం’ అని ఆమె ట్వీట్ చేసింది. ఇలాంటి చర్యలు మన రాజ్యాంగాన్ని, మన దేశ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్నారు. కాంగ్రెస్, టీఎంసీ సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులు గురువారం హరిద్వార్లో ‘ద్వేషపూరిత ప్రసంగ సమావేశం’ను ఖండిరచారు. అందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరిద్వార్లోని వేద్ నికేతన్ ధామ్లో జరిగిన ఈ ధర్మ సంసద్ను జునా అఖాడాకు చెందిన యతి నరసింహానంద గిరి నిర్వహించారు. ఆయన ఇప్పటికే ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసి హింసను ప్రేరేపించినందుకు పోలీసుల దృష్టిలో ఉన్నాడు.