మండిపడ్డ ఛత్తీస్గఢ్ సీఎం
జగదల్పూర్ : రైతులు పండిరచిన వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం తీరును తప్పుబడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు. తాజాగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ కూడా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిధాన్యం సేకరణ, డీఏపీ ఎరువుల సరఫరాపై కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందడం లేదని మండిపడ్డారు. గిరిజనులు అధికంగా ఉండే 14 జిల్లాల్లోని సహజవనరులను మెరుగ్గా వినియోగించుకునే లక్ష్యంలో రూపొందించిన ఛత్తీస్గఢ్ ఇంక్లూజివ్ రూరల్ అండ్ యాక్సిలరేటెడ్ అగ్రికల్చర్ గ్రోత్ అనే ప్రాజెక్టును బుధవారం ఆయన జగదల్పూర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, ప్రతి ఒక్కరికీ పోషక ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో రూ. 1,735 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందకపోయినా బస్తర్, బీజాపూర్, దంతేవాడ, కంకేర్, కొండగావ్, నారాయణపూర్, సుక్మా, ముంగేలి, బలోదాబజార్, బల్రాంపూర్, జస్పూర్, కొరియా, సూరజ్పిర్, సుర్గుజా జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు వెల్లడిరచారు. రాష్ట్రానికి కేంద్రం నిత్యం అన్యాయం చేస్తోందని విమర్శించారు. వరిధాన్యాన్ని కొనమని, మద్దతు ధర కన్నా ఒక్కపైగా అధికంగా చెల్లించమని, బాయిల్ రైస్ వద్దు అంటూ అనేక అడ్డంకులను సృష్టిస్తోందని దుయ్యబట్టారు. పంటలకు అవసరమైన ఎరువులను కూడా సక్రమంగా అందించడంలేదని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.