సోనియాకు సచిన్ పైలట్ అల్టిమేటం
జైపూర్: కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ రాష్ట్ర శాఖలో అసమ్మతి కుంపటి మళ్లీ రాజుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని పార్టీ యువనేత సచిన్ పైలట్ పట్టుపడుతున్నారు. ‘‘వీలైనంత తొందరగా నన్ను సీఎం చేయండి. ఆలస్యం వద్దు. మరో యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒకవేళ అలా చేయమని పక్షంలో పంజాబ్ లాగే ఇక్కడా మనం ఓడిపోతాం జాగ్రత్త..’’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పైలట్ ఇటీవల అన్నారు. తనను సీఎం చేయకుంటే.. రాజస్థాన్లో అధికారం కోల్పోవడం ఖాయం అని పైలట్ ఖరాఖండిగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. పైలట్ ఇటీవల సోనియా, రాహుల్, ప్రియాంకతో భేటీ అయ్యారు. ఒక్క వారంలోనే ఏకంగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఈ మూడు మార్లూ తనన సీఎం చేయాలన్న డిమాండ్నే అధిష్ఠానం ముందు ఉంచినట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
రాజస్థాన్ సీఎం గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కొన్ని రోజులుగా బహిరంగంగానే మాటల యుద్ధం సాగుతోంది. ఆ తర్వాత అధిష్ఠానం రంగంలోకి దిగడంతో కాస్త సర్దుబాటైంది. ఆ తర్వాత సచిన్ పైలట్కు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పజెబుతామని అధిష్ఠానం ఎంత మొత్తుకున్నా ఆయన ససేమిరా అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబట్టారు.