సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
నాలుగు వారాల్లో తుది నిర్ణయం
న్యూదిల్లీ : నీట్ రిజర్వేషన్ల విషయంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) వారిని గుర్తించడంపై పునఃసమీక్షిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారిని గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనానికి తుషార్ మెహతా వివరించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై కమిటీ నివేదిక వచ్చే వరకు నాలుగు వారాలపాటు నీట్ కౌన్సిలింగ్ను వాయిదా వేస్తామని చెప్పారు.