కోచ్చి: సీపీఎంలో చేరాలంటూ కేరళ సీపీఎం సెక్రటరీ కొడియారి బాలకృష్ణన్ ఆహ్వానంపై ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కేవీ థామస్ స్పందించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తనపై చర్యలు తీసుకున్నా పర్వాలేదనీ, రాజకీయ ఆశ్రయం అనాథలకే తప్ప తనకు కాదని పేర్కొన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లో తనకు ఇప్పటికీ స్థానముందని తెలిపారు. అదికూడా బలంగా ఉందనీ, పార్టీలో పదవులు కోల్పోవడమనేది కూర్చీ తీసుకెళ్లి బల్ల వేసినట్టేనన్నారు. ‘పార్టీలో స్థానాలనేవి బల్లలు, కుర్చీల్లాంటివి. ఒకవేళ కుర్చీ తీసుకెళ్లిపోతే, నాకు బల్ల ఉంటుంది. వాటితో నాకు ఎలాంటి సమస్యా లేదు. నేను కాంగ్రెస్వాదిగానే ఉండేదుకు ఇష్టపడతా’ అతని తెలిపారు. ఇప్పటి వరకు తనపై చర్యలు తీసుకున్నట్లు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, ఒకవేళ సమాచారం వస్తే అప్పుడు తన నిర్ణయమేమిటో చెబుతానన్నారు. థామస్ను పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ నుంచి, కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తొలగించాలన్న క్రమశిక్షణ సంఘం ప్రతిపాదనలకు సోనియా గాంధీ మంగళవారం అనుమతిచ్చారు. ఒకవేళ పార్టీ బహిష్కరిస్తే సీపీఎంలో చేరాలంటూ మంగళవారం సాయంత్రం బాలకృష్ణన్ ఆహ్వానించారు.