ఐదుగురిపై వేటు : ఏడుగురికి ఛాన్స్
నేడే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కొత్త కేబినెట్ ఖరారు అయింది. ఇదే విషయమై రాష్ట్ర గవర్నర్తో చన్నీ భేటీ అయ్యారు. ఆదివారం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ అధిష్టానంతో తుది దశ చర్చలు జరిపిన తర్వాత దిల్లీ నుంచి చన్నీ తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. కేబినెట్లో ఏడుగురు కొత్త వారికి అవకాశం లభించిందని, అమరేందర్ సింగ్ కేబినెట్లోని ఐదుగురు ఎమ్మెల్యేలు కేబినెట్ బర్త్లు కోల్పోయారని తెలిసింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించేందుకు దిల్లీకి రావాలని చన్నీకి అధిష్ఠానం నుంచి పిలుపు అందిన విషయం విదితమే. కాగా, కేబినెట్ కొత్త మంత్రులలో పర్ఘాట్ సింగ్, రాజ్ కుమార్ వెర్కా, గుర్కిరత్ సింగ్ కోట్లి, సంగత్ సింగ్ గిల్జియన్, అమరీందర్ సింగ్ రాజా వర్రింగ్, కుల్జిత్ నాగ్రా, రాణా గుర్జిత్ సింగ్ ఉండగా విజయ్ ఇందర్ సింగ్లా, మన్ప్రీత్ సింగ్ బాదల్, బ్రహ్మ మొహింద్రా, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, త్రిప్త్ రాజిందర్ సింగ్ బజ్వా, అరుణు చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ ఆశు తిరిగి కేబినెట్ బర్తులను దక్కించుకున్నారు. మరోవైపు ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్, అటవీ మంత్రి సంధు సింగ్ ధరంస్లాట్, క్రీడా మంత్రి రాణా, మరో ముగ్గురు మంత్రులు గుర్మీత్ సోడి, ఎస్ఎస్ అరోరా, గుర్ప్రీత్ కంగర్లపై వేటు పడినట్లు తెలిసింది.