న్యూదిల్లీ : పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పులు , పిల్లల హక్కుల కోసం కృషి చేస్తున్న పది అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థలకు అందుతన్న నిధులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని హిందూ దిన పత్రిక వెలుగులోకి తెచ్చింది. విదేశీ ఎన్జీవోలకు సంబంధించిన విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 (ఎఫ్సీఆర్ఏ)లో జూలై 1 నుంచి ప్రిఫరెన్స్ కేటగిరీ పేరుతో కొన్ని నిబంధలను భారత రిజర్వు బ్యాంకు విధించినట్టు తెలిపింది
భారతదేశంలోని ఎన్జీవోలకు విదేశీ దాతలు ఆర్థిక సహాయం చేయాలని భావిస్తే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్లో పని చేస్తున్న విదేశాలకు చెందిన ఎన్జీవోలైన ఒమిడ్యార్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, స్టార్డస్ట్ ఫౌండేషన్, యూఎస్కి చెందిన హ్యుమానిటీ ఇంటర్నేషనల్, బీ వాక్ ఫ్రీ ఫౌండేషన్, ఆస్ట్రేలియాకు చెందిన మిండరూ ఫౌండేషన్ యూకేకి చెందిన చిల్డ్రన్ నిధి ఫౌండేషన్, ఫ్రీడమ్ ఫండ్, లౌడ్స్ ఫౌండేషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన క్లైమేట్ ఫౌండేషన్ తదితర సంస్థలకు అందుతున్న నిధులపై కేంద్రం ఆంక్షలు విధించినట్టు తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇటీవల తన శాఖలకు పంపిన నోటీసును హిందు పత్రిక ఉదాహరించింది. సామాజిక ప్రయోజనాల కోసం పని చేస్తున్న సదరు సంస్థలను ఆంక్షలు విధించాల్సిన జాబితాలో ఎందుకు చేర్చారని హిందు విలేకరి ఒక ప్రభుత్వ అధికారిని వివరణ కోరగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న కారణంగానే ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ చర్యలు మొత్తం ఎన్జీవో వ్యవస్థను నాశనం చేయడానికేనని ప్రముఖ సంస్థలు వ్యాఖ్యానిస్తున్నాయి.