కంగనా రనౌత్, అద్నాన్ సమీలకు పద్మశ్రీ అవార్డు ప్రదానం
న్యూదిల్లీ : అనేక రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో సోమవారం అట్టహాసంగా జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు. భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా.. ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2020 ఏడాదికి మొత్తం 118 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేయగా అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, మిగిలిన వారికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. మరణానంతరం జార్జి ఫెర్నాండెజ్, అరుణ్జైట్లీ, సుష్మా స్వరాజ్, విశ్వేశ్వరతీర్థ స్వామీజీలకు పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. వీరితో పాటు పండిత్ చెన్నూలాల్ మిశ్రా, మేరికోమ్, అనిరుధ్ జుగ్నౌద్ మిశ్రాలను పద్మవిభూషణ్ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, పీవీ సింధూ, మనోహర్ పారికర్(మరణానంతరం) సహా 16 మందికి పద్మభూషణ్ ప్రకటించింది. ప్రముఖ నటి కంగనా రనౌత్, గాయకుడు అద్నాన్ సమీ, నిర్మాతలు ఏక్తా కపూర్, కరణ్ జోహార్, క్రీడాకారుడు జహీర్ ఖాన్ తదితరులను పద్మశ్రీ వరించింది. వీరంతా రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.