స్వతంత్ర అభ్యర్థి ఉత్పల్ పారికర్
పనాజీ : పనాజీ ప్రజల అభిమానం ఎనలేనిదని, తన తండ్రి, స్థానిక ప్రజల మధ్య ఉన్న అపారమైన ప్రేమ బంధాన్ని తాను ప్రత్యక్షంగా అనుభవించానని గోవా మాజీ ముఖ్యమంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ బుధవారం తెలిపారు. ఆయన ఈ శాసనసభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గోవాలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఓటింగ్ జరిగింది. పనాజీ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ ఉత్పల్ పారికర్కు టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అందుకు బదులుగా బీజేపీ పనాజీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుండి పార్టీలో చేరిన అటానాసియో మోన్సెరాట్ను రంగంలోకి దించింది. ‘గత నెల రోజులుగా నేను పనాజీలో విస్తృతంగా తిరిగాను. ఈ సమయంలో మీలో చాలా మందితో సంభాషించే అవకాశం నాకు లభించింది. నా తండ్రి దివంగత మనోహర్ పారికర్ అంత అపారమైన ప్రేమను ఎందుకు అనుభవించారో ఇప్పుడు అనుభూతి చెందాను’ అని ఉత్పల్ మంగళవారం వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విడుదల చేసిన తన ఎన్నికల పోలింగ్ అనంతర సందేశంలో తెలిపారు. దివంగత పారికర్ 1994 నుండి ఆరుసార్లు పనాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.