దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడి రాజస్థాన్లో 12 వేల పశువులు మృత్యువాతపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం పశువుల సంతలపై నిషేధం విధించింది. రాజస్థాన్లో ఇప్పటి వరకు 2,81,484 పశువులకు లంపీ వ్యాధి సోకిందని గుర్తించారు. వీటిలో 2,41,685 పశువులకు చికిత్స అందించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో లంపీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు. రాజస్థాన్ తర్వాత గుజరాత్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్లలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. అయితే, ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ను ఉపయోగిస్తున్నారు.