కీవ్ నుంచి తరలి వెళ్లేందుకు ఉక్రెయిన్ రైల్వే ప్రత్యేక సర్వీసులు
భారత రాయబార కార్యాలయం సూచన
కీవ్: రష్యా జరుపుతోన్న దాడులతో ఉక్రెయిన్ వణికిపోతోంది. రాజధాని నగరం కీవ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు రాయబార కార్యాలయం తాజాగా మరో సూచన జారీ చేసింది. కీవ్ నగరంలో కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో భారతీయులను పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్లిపోవాలని సూచించింది. విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను అక్కడి ప్రభుత్వం నడుపుతున్నట్లు తెలిపింది. ‘కీవ్ నగరంలో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేశారు. పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు గాను విద్యార్థులందరూ రైల్వే స్టేషన్లకు తరలివెళ్లండి. కీవ్ నుంచి తరలి వెళ్లేందుకు ఉక్రెయిన్ రైల్వే ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది’ అని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా ఉక్రెయిన్లో దాదాపు 16వేల మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం. వారందరినీ అక్కడి సరిహద్దు దేశాలైన హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేకియా దేశాల నుంచి స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది.