పాట్నా : దాణా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్.. పాట్నా వీధుల్లో కారు నడుపుతూ కనిపించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ఓపెన్ టాప్కారులో చక్కర్లు కొట్టారు. తద్వారా తనకు ఆరోగ్యం క్షీణించినా.. ఇప్పటికీ రాజకీయంగా తాను డ్రైవింగ్ సీటులోనే ఉన్నాననే సందేశాన్ని కార్యకర్తలకు పంపారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య అయిన రబ్రీదేవికి పాట్నాలో కేటాయించిన బంగ్లాకు చుట్టు పక్కల ఉన్న వీధుల్లో లాలూ ఓపెన్ టాప్ జీపు నడుపుతూ సందడి చేశారు. ఎన్నో ఏళ్ల తరువాత జీపు ఎక్కిన లాలూ… వాహనాన్ని రివర్స్లో నడిపారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఒకింత ఆందోళనకు గురైనా.. ఆయన మాత్రం తన డ్రైవింగ్ను ఆస్వాదించారు. లాలూ ఓ ప్రాంతానికి చేరుకోగానే ఆయనను చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు.. ‘లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు. ఈ వీడియోను లాలూ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ‘చాలా ఏళ్ల తరువాత మొదటి సారి వాహనం నడిపాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో డ్రైవర్గా మారుతారు. ప్రేమ, సామరస్యం, సమానత్వం, శ్రేయస్సు, సహనం, న్యాయం లాంటి వాటిని మోసుకెళ్లే జీవితం అనే కారు ప్రయాణం కూడా సాఫీగా సాగాలి’ అని లాలూ ట్వీట్ చేశారు. దాణా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.