రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
‘అగ్నిపథ్ పథకం’ పై మరోసారి వివాదం రాజుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన కులం, మతానికి సంబంధించిన సర్టిఫికెట్లు కోరుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పాత విధానం ప్రకారమే మిలటరీ రిక్రూట్మెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు.స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నామన్నారు. అయితే, అగ్నిపథ్ పథకం రిక్రూట్మెంట్లో కుల, మత ధ్రువీకరణపత్రాలు కోరడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, జేడీయూ నేత ఉపేంద్ర కుష్వాహ పలు ప్రశ్నలు సంధించారు. దీంతో వివాదం రాజుకున్నది. అయితే, దీనిపై సైన్యం సైతం ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ పథకం కింద సైనిక రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాత విధానాన్నే కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. గతంలోనూ కుల, మత ధ్రువీకరణపత్రం తీసుకున్నామని చెప్పింది.