పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ రాజా
చండీగఢ్ : పార్టీ బలోపేతానికి, సవాళ్లను ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావం, చర్చను అనుసరించాల్సిన అవసరం ఉందని కొత్త నియమితులయిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ రాజా వార్నింగ్ అన్నారు. శుక్రవారం ఇక్కడ పంజాబ్ కాంగ్రెస్ భవన్ వద్ద పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పంజాబ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆశుతో కలిసి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ తర్వాత వారింగ్ పీసీసీ పగ్గాలు చేపట్టారు. నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వారింగ్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ఒక ‘సోచ్’ (ఆలోచన), ‘విచార్’ (చింతన) అది అంతం కాదని అన్నారు. 44 ఏళ్ల వారింగ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ అవసరమని, ఏ వ్యక్తి లేదా పార్టీలో క్రమశిక్షణ లేకపోతే అది ఎదగదని చెప్పారు. ‘మనం విజయం వైపు పయనించాలంటే మన జీవితంలో మూడు ‘డి’లను స్వీకరించాలని పేర్కొంటూ, బాధ్యతను భుజానికి ఎత్తుకోవడం కూడా ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారితో చర్చకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ‘నేను నా సొంత వ్యూహాన్ని రూపొందించుకుంటే, మనం విజయం వైపు వెళతామని నేను భావించడం లేదు. పార్టీలోనే కాదు. వ్యాపారంలో కూడా సహచరులతో చర్చించడం లేదా సమష్టిగా కృషి చేస్తేనే విజయం సాధిస్తాం’ అని వారింగ్ అన్నారు. తర్వాత వారింగ్ ఒక ట్వీట్లో ‘పార్టీ బలోపేతానికి నా 3`డి మంత్రం డిసిప్లెయిన్ (క్రమశిక్షణ, డెడికేషన్ (అంకిత భావం), డైలాగ్ (చర్చ)’ అని పేర్కొన్నారు. వారింగ్ పీసీపీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, ఏఐసీసీ పంజాబ్ ఇన్ఛార్జి హరిశ్ చౌదరి, పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా, ఎమ్మెల్యేలు సుఖ్పాల్ ఖైరా, త్రిప్తు రాజిందర్ బజ్వా, సుఖిజిందర్ సింగ్ రంద్వా, సుఖిబిందర్ సర్కారియా, ఎంపీలు మనీశ్ తివారి, జస్బీర్ దింపా, పార్టీ ఇతర నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ పార్టీ కార్యాలయానికి వచ్చినప్పటికీ, ఇతర నాయకులతో కలిసి వేదికను పంచుకోలేదు. ఇక పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కూడా కార్యక్రమంలో కనిపించలేదు.