న్యూదిల్లీ : వ్యవసాయ చట్టాల అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్లో నిరసనకు దిగారు. అంతకుముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి సోనియా ప్రసంగించారు. అనంతరం పార్టీ నాయకులు కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలన్న బ్యానర్లు చేతబట్టి నిరసన తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, దిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన నిరసనల సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంతో పాటు రైతులకు ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
రైతుల పేరుతోనే పార్లమెంట్లో సూర్యోదయం : రాహుల్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు గురించి ప్రస్తావించారు. ‘ఈరోజు పార్లమెంటులో సూర్యోదయం అన్నదాత పేరు మీద ఉండాలి’ (ఆజ్ సంసద్ మే అన్నదాతా కే నామ్ కా సూరజ్ ఉగానా హై) అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.