Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పింఛను పెరిగేనా…?

రూ.300 నుంచి పెంపు కోసం వృద్ధుల ఎదురుచూపులు
పదేళ్లుగా నిరీక్షణే…
జాతీయ పింఛను పథకాలపై నీలినీడలు
కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కార కమిటీ ఏదీ…?

దేశంలో పేద వృద్ధులు తమ పింఛను మొత్తం ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు.
రూ.300గా ఉన్న పింఛను పెంపుదల కోసం 10 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు.

న్యూదిల్లీ : దేశంలో పేద వృద్ధులు తమ పింఛను మొత్తం ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురు చూపులు చూస్తున్నారు. రూ.300గా ఉన్న పింఛను పెంపుదల కోసం 10 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. మూడు వందల రూపాయలు అంటే, అది కొంతమందికి ఒక సినిమా టికెట్‌ లేదా ఒక కాఫీ, మరికొంత మందికి వారపు సరుకుల బడ్జెట్‌ లేదా ఒక ‘ధాబా’లో సాధారణ కుటుంబ భోజనం కోసం ఖర్చు చేసే మొత్తం కావచ్చు. కానీ భారతదేశం అంతటా అనేక వేల మందికి వారి నెల మొత్తం పింఛను. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం, ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛను పథకం కింద అందజేసే పింఛను మొత్తం చివరిసారిగా 2012లో నెలకు రూ.200 నుంచి రూ.300కి పెరిగింది. అయితే 10 ఏళ్లుగా మరో పెంపు కోసం నిరీక్షణ కొనసాగుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) కుటుంబాలకు చెందిన వారి కోసం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఈపీ) కింద ప్రభుత్వం వివిధ పింఛను పథకాలను అమలు చేస్తుంది. కాగా అనేక మంది లబ్ధిదారులకు పెరుగుతున్న ధరల పరంగా సరిపోకపోయినా ఏదైనా పెరుగుదల స్వాగతించదగినది. 65 ఏళ్ల హిరీ దేవి 10 ఏళ్లుగా పక్షవాతంతో మంచాన పడి వికలాంగుల పింఛను పథకం కింద ప్రతి నెలా రూ.300 పొందుతోంది. ‘70 ఏళ్లు పైబడిన నా భర్త ఇటీవలి ద్రవ్యోల్బణం దృష్ట్యా రోజువారీ కూలీగా పని చేయడం ప్రారంభించాడు. ఈ డబ్బులో మాకు ఐదు రోజుల పాటు రేషన్‌ కూడా లభించదు’ అని దిల్లీలోని జహంగీర్‌పురి కాలనీలో నివసిస్తున్న హిరీ దేవి పీటీఐకి చెప్పారు. అయితే కొన్ని నెలల క్రితం వరకు హిరీ దేవి స్వచ్ఛంద సంస్థల నుంచి అదనపు రేషన్‌ పొందుతోంది. కానీ కోవిడ్‌19 మహమ్మారి పరిస్థితి మెరుగుపడటంతో అది నిలిచిపోయింది. కాగా వెంటనే ఉపశమనం కనిపించడం లేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త చంద్ర శేఖర్‌ గౌర్‌ ఇటీవల దాఖలు చేసిన ఆర్‌టీఐ ప్రశ్నకు సమాధానంగా, జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పథకాల కోసం నోడల్‌ మంత్రిత్వ శాఖ కింద అందించే పింఛను మొత్తాన్ని మార్చడానికి సంబంధించిన ప్రతిపాదన లేదని వెల్లడయింది. ఆహార అవసరాలూ తీర్చదు... మందులూ కొనలేం... 72 ఏళ్ల లాలా రామ్‌ కూడా పక్షవాతానికి గురై స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు. అతని కోడలు గంగ కుటుంబ బాధలను మౌఖికంగా చెప్పింది. ‘పింఛనుతో సహా మొత్తం కుటుంబ ఆదాయం రూ.2,000. ఆరుగురు ఉన్న కుటుంబాన్ని పోషించడం చాలా కష్టం. పైగా, ఆదాయం నిలకడగా లేదు’ అని దిల్లీలోని మయూర్‌ విహార్‌ ప్రాంతంలో నివసించే గంగ అన్నారు. అయితే కొంతమంది అనేక మూలాల నుంచి పింఛను పొందుతారు. 2015లో క్యాన్సర్‌తో తన భర్తను కోల్పోయానని, ఇందిరాగాంధీ వితంతు పింఛను పథకం, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను ద్వారా పొందే ఒక్కొక్కరికి రూ.300 పైనే ఆధారపడి ఉన్నానని పేరు వెల్లడిరచడానికి ఇష్టపడని 76 ఏళ్ల వృద్ధురాలు తెలిపింది. తన నిరుద్యోగి కొడుకుతో కలిసి రాంచీలో నివసిస్తున్న మహిళకు జార్ఖండ్‌ ప్రభుత్వం నుంచి కొంత డబ్బు కూడా వస్తుంది. కానీ మొత్తం రూ.2,500 చాలదు. ‘ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. అది 10 రోజుల పాటు మన ఆహార అవసరాలను తీర్చదు. నేను మందులు కూడా కొనలేను’ అని ఆమె ఫోన్‌లో పీటీఐకి తెలిపింది. ఏదిఏమైనా, దేశంలో పింఛన్లు ఎప్పటికీ సరిపోవు. కానీ అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఆ మొత్తం వందల్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కొన్ని వేలల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రాలు తమ సొంత పథకాలను కలిగి ఉన్నాయి. దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక పింఛను ఇచ్చేవిగా ఉన్నాయి. కేంద్రం ఇస్తున్న దానికే సహకారం అందించే రాష్ట్రాలు ఉన్నాయి. ‘ఈ మొత్తం తప్పనిసరిగా నెలకు కనీసం రూ.5 వేలు ఉండాలి’ అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు కలిపినా ఆర్థిక సాయం దేశంలో ఎక్కడా రూ.3,500 దాటడం లేదని వివరించారు. ఆర్‌టీఐలో పంచుకున్న వివరాల ప్రకారం, 2.9 కోట్ల మంది లబ్ధిదారులు ఎన్‌ఎస్‌పీఏ కింద అన్ని పెన్షన్‌ల పథకాల పరిధిలోకి వచ్చారు. కాగా హెల్ప్‌ఏజ్‌ ఇండియాలో పాలసీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వకేసీ హెడ్‌ అనుపమ దత్తా... కనీస మొత్తం రూ.5 వేలు ఉండాలన్న మురళీధరన్‌తో ఏకీభవించారు. ఆమె దృష్టిలో ప్రభుత్వం పేద వృద్ధులకు నెలకు రూ.5 వేలు ప్రాథమిక సామాజిక పింఛను భద్రత కల్పించాలి. 90 శాతం మంది వృద్ధులు బతకడానికి పని చేయాల్సి ఉంటుంది. కోవిడ్‌19 మహమ్మారి కారణంగా వృద్ధులు, వారి కుటుంబాలు ఉపాధి, ఆదాయాన్ని కోల్పోయాయని, ఎక్కువగా అసంఘటిత రంగం నుంచి ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని, మహమ్మారి నుంచి ఇంకా కోలుకోలేదని అనుపమ దత్తా తెలిపారు. ‘ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర విరాళాన్ని రూ.200 నుంచి సవరించాలి (80 ఏళ్లలోపు వారికి 14 సంవత్సరాలు మారదు). ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం కింద 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 కనీసం రూ.1,000, నెలకు రూ. 1,500’ అని దత్తా చెప్పారు. కేంద్ర కేటాయింపుల్లో రాష్ట్రాలు విడివిడిగా అగ్రస్థానంలో ఉన్నాయి. బీహార్‌ దాని వృద్ధులకు (60-80 సంవత్సరాలు) రూ.400 నుంచి 500 మాత్రమే ఇస్తోంది. సార్వత్రిక కవరేజీతో ఇది ఏ ప్రమాణం కింద అయినా మనుగడకు సరిపోదు. ఛత్తీస్‌గఢ్‌ రూ.550 నుంచి 850 ఇస్తుంది. భారతదేశంలో అత్యధిక వృద్ధుల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రం కూడా రూ.700 (60 ఏళ్లు పైబడిన వారికి), రూ.1,000 (80 ఏళ్లు పైబడిన వారికి) మంజూరు చేస్తోంది. దత్తా ప్రకారం, సీనియర్‌ సిటిజన్లకు పింఛను నిధిపై సంయుక్తంగా నిర్ణయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేయడం పరిష్కారం. సామాజిక-ఆర్థిక కుల గణన 2011 ద్వారా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 50 శాతం మంది వృద్ధులు పేదలు. అలాగే దేశంలో 104 మిలియన్ల వృద్ధులు 60 ఏళ్లు పైబడిన వారు. దేశం మొత్తం జనాభాలో వీరు 8.6 శాతంగా ఉన్నారు.
పింఛను పొందాలంటే ఎన్ని కష్టాలో…
ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, చైర్‌పర్సన్‌ హిమాన్షు రాత్‌ మాట్లాడుతూ పింఛను చాలా తక్కువగా ఉందని, సక్రమంగా లేదని ఎత్తి చూపారు. ‘అనేక అధికార సంబంధమైన అడ్డంకులతో పింఛను పొందే ప్రక్రియ కూడా కష్టం. ఏ ప్రభుత్వ విభాగమైనా తీసుకోవడానికి ఇష్టపడే బాధ్యత శూన్యం’ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అభ్యర్థి లేదా గ్రామ పంచాయితీ లేదా గ్రామసభ నుంచి వచ్చిన దరఖాస్తు ఆధారంగా లబ్ధిదారుని గుర్తింపు పొందవచ్చు. అన్ని సందర్భాల్లో, దరఖాస్తు ఫారం ఉప జిల్లా స్థాయి కార్యాలయాలకు సమర్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని బ్లాక్‌లు, పట్టణ కేంద్రాల విషయంలో మున్సిపాలిటీలలో సమర్పించాలి. పింఛను కోసం కొత్త కేసును అంగీకరించే ముందు వివిధ స్థాయిల్లో ధ్రువీకరణ ఉంటుంది. అంతేకాకుండా, మరణాలు, వలసలు, బదిలీ చేయబడిన కేసులను గుర్తించడానికి క్రమం తప్పకుండా ధ్రువీకరణలు నిర్వహిస్తారు. దరఖాస్తును ధ్రువీకరించిన తర్వాత, మంజూరు చేసే అధికారం దానిని మంజూరు చేసిన తర్వాత, మంజూరు ఆర్డర్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఆధార్‌ ఆధారంగా నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ ఉపయోగించి సంబంధిత పింఛనుదారు బ్యాంక్‌ ఖాతాలకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నిధులు బదిలీ అవుతాయి. జులైలో ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో ఐదుగురు సీనియర్‌ సిటిజన్లలో నలుగురు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బంది పడుతున్నారని తేలింది. భారతదేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ సామాజిక-ఆర్థిక సమూహాలకు చెందిన 10 వేల మంది వృద్ధ ప్రతివాదులను కవర్‌ చేసిన ఈ సర్వే, దిగువ మధ్య-ఆదాయ వర్గాలు ఎక్కువగా బాధపడుతున్నాయని స్పష్టమయింది. ఈ వర్గానికి చెందిన 94 శాతం మంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం తమను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img