న్యూదిల్లీ : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగివస్తున్నాయి. ఈ తగ్గుదల మరికొన్ని రోజులు కొనసాగితేనే రిటైల్గా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అధికార వర్గాలు వెల్లడిరచాయి. దేశీయ రిటైల్ ధరలు 15 రోజుల రోలింగ్ యావరేజ్ ఆధారంగా నిర్ణయిస్తున్నందున ఈ పరిస్థితి నెలకొంది. నవంబరులో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల నుంచి 82 డాలర్ల మధ్యలోనే ఉంది. గత శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లు మొదలుకాగానే 4 డాలర్ల మేరకు చమురు ధరలు పతనమయ్యాయి. ఇక బ్రెంట్ ఫ్యూచర్లు 6 డాలర్లు పతనమై 72.91 వద్దకు చేరాయి. కరోనా కొత్త వేరియంట్ చమురు మార్కెట్లలో భయాన్ని నింపింది. ఈ వైరస్ వ్యాపిస్తే మరోసారి చమురు డిమాండ్ భారీగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు రోజు వారీ చమురు ధరలను నిర్ణయిస్తుండగా, ఈ ప్రక్రియకు పదిహేనురోజుల చమురు ధరలను పరిగణలోకి తీసుకొంటారు. ముడి చమురు తగ్గుదల మరికొన్నాళ్లు కొనసాగితేనే ఆమేరకు రిటైల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
వ్యూహాత్మక నిల్వల విడుదల
కొన్ని నెలలుగా చమురు ఉత్పత్తిచేసే దేశాల( ఒపెక్) సంఘం కోటాలు నిర్ణయించుకుని డిమాండ్ కంటే తక్కువగా చమురును ఉత్పత్తి చేస్తున్న పర్యవసానంగా ధర పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా సహా చమురు దిగుమతి చేసుకొనే ప్రధాన దేశాలు వ్యూహాత్మక నిల్వల్లో కొంత భాగాన్ని బహిరంగ మార్కెట్లోకి విడుదల చేశాయి. భారత్ దాదాపు 50 లక్షల పీపా (బ్యారెల్)ల చమురును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఒపెక్కు వ్యతిరేకంగా పలు దేశాలు ఈ నిర్ణయం తీసుకొన్నాయి. భారత్ కూడా తొలిసారి తన వ్యూహాత్మక నిల్వలను వాడటం మొదలుపెట్టింది.
ఒపెక్ దేశాల వైఖరితో ధరల పెరుగుదల
ఒపెక్ దేశాలు ప్రపంచ చమురులో సగం ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో రష్యా, సౌదీ అరేబియాలు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు. ఇటీవల చమురు ఉత్పత్తిలో కోత విధించి ధరల పెరుగుదలకు కారణం కావడంలో వీటి పాత్ర చాలానే ఉంది. ఒపెక్ దేశాలు రోజుకు కోటి పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని 2020లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కోవిడ్ కారణంగా డిమాండ్ పడిపోయి చమురు పీపా ధర 20 డాలర్ల వద్దకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకొన్నాయి. కానీ, 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ కోలుకోవడంతో చమురుకు డిమాండ్ పెరిగింది. కానీ, ఆ మేరకు ఉత్పత్తిని మాత్రం పెంచలేదు. ఫలితంగా చమురు ధరలు రివ్వున పెరిగిపోయాయి. ఒపెక్ సభ్యదేశాలు చెప్పిన దాని కన్నా 5.4 మిలియన్ పీపాల చమురును తక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.
భారత్లో పన్నుల విధింపు
భారత్లో 2020లో చమురుపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గడంతో పెట్రోల్పై రూ.13, డీజిల్పై రూ.16 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని విధించారు. వీటికి రాష్ట్రాల వ్యాట్ కూడా తోడు కావడంతో దేశీయంగా వినియోగదారులపై భారం పడిరది. రవాణా చార్జీల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేదలు, సామాన్యులకు బతుకు భారమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకు తోడు ఒపెక్ దేశాల తీరు తోడు కావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100ను దాటేశాయి. కేంద్రం ఇటీవల పెట్రోల్పై రూ.5, డీజిల్ రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ వినియోగదారులకు ఏమాత్రం ఊరట లభించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. 606 మిలియన్ పీపాల సామర్థ్యంతో వీటిని నిర్మించింది. లూసియానా, టెక్సాస్లోని తీర ప్రాంతాల్లోని భూగర్భ గుహల్లో వీటిని ఏర్పాటు చేసింది. అమెరికా అవసరాలను ఇవి మూడు నెలల పాటు తీర్చగలవు. గతంలో అమెరికా మూడు సార్లు ఈ నిల్వల నుంచి చమురును విడుదల చేసింది. అమెరికా తర్వాతి స్థానాల్లో జపాన్, చైనా ఉన్నాయి. తాజాగా వివిధ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీయడంతో రష్యా, సౌదీలు క్రమంగా ఉత్పత్తిని పెంచనున్నట్లు సంకేతాలిస్తున్నాయి.