న్యూదిల్లీ : పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన గడువును పొడిగించింది. సాధారణంగా ఈ గడువు నవంబరు 30తో ముగియడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 31 వరకు పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ను బ్యాంకులకు సమర్పించవచ్చని స్పష్టంచేసింది. అనేక రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతుండటం, వృద్ధులకు కోవిడ్ ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. పెన్షనర్లు తాము జీవించే ఉన్నామని చెప్పేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు ఏటా లైఫ్ సర్టిఫికెట్ని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతినెలా పెన్షన్ పొందేందుకు ఈ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే, దీన్ని నవంబరు 30లోపు సమర్పించాల్సి ఉండగా..కోవిడ్ ముప్పు వృద్ధులకు అధికంగా ఉన్న తరుణంలో బ్యాంకు శాఖల వద్ద రద్దీని తగ్గించే ఉద్దేశంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.