న్యూదిల్లీ : స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పథకం బకాయిల నిలిపివేతపై నమోదైన పిటిషన్పై విచారించిన దిల్లీ హైకోర్టు నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే స్వాతంత్ర సమరయోధురాలైన తన అత్తగారు స్వతంత్ర సేనాని సమాన్ పెన్షన్ పథకం కింద 1972 నుంచి నిరంతరం పింఛను పొందుతున్నారని, అయితే ఎటువంటి సమాచారం లేకుండా ఆ పెన్షన్ను 2015 నుంచి నిలిపి వేశారని ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై తాము ఎన్నోసార్లు అధికారులు సంప్రదించినా చాలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. 2020 డిసెంబర్లో ఆమె మరణించే వరకు పెన్షన్ పునరుద్దరించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో తన అత్తగారు బతికి ఉన్న కాలానికి చెల్లించాల్సిన పెన్షన్ బకాయిలను చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ రేఖాపల్లి పిటిషన్ దారు పేర్కొన్న అంశాలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.