రూ.17కోట్లు సీజ్
కర్ణాటక బెంగళూరులోని ఆరుచోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో దాడులు నిర్వహిస్తున్నది. చైనీస్ లోన్ యాప్ కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఆన్లైన్ పేమెంట్ గేట్వే కంపెనీలైన రేజర్ పే, పేటీఎం, క్యాష్ఫ్రీ లొకేషన్లలో దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో శుక్రవారం దాడులు ప్రారంభం కాగా.. ఇంకా కొనసాగుతున్నట్లుగా ఈడీ తెలిపింది. చైనా నియంత్రణలో ఉన్న సంస్థల మర్చంట్ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.17కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ పేర్కొంది. భారతీయుల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి.. వారిని డైరెక్టర్లుగా చూపి అక్రమంగా ఆదాయాన్ని పొందుతున్నారని ఈడీ పేర్కొంది. పేమెంట్ గేట్వేలు, వివిధ మర్చంట్ ఐడీలు, బ్యాంకు ఖాతాల ద్వారా సంస్థలు అనుమానాస్పద, అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా తెలిసిందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.