న్యూదిల్లీ : బహుపాక్షిక వేదికలతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసేందుకు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ తన భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించిన ‘సమ్మిట్ ఫర్ డెమోక్రసీ’లో పాల్గొన్న ఒకరోజు తర్వాత మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు ప్రజాస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, బహుపాక్షిక వేదికలతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి మా భాగస్వాములతో కలిసి పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని, సాంకేతికత కలిగి ఉన్నందున, ప్రజాస్వామ్య సమాజాలను పరిరక్షించడంలో సాంకేతిక సంస్థలు సహకరించాలని మోదీ గురువారం జరిగిన వర్చువల్ సమ్మిట్లో అన్నారు. బైడెన్ నిర్వహిస్తున్న సమ్మిట్ ఫర్ డెమోక్రసీలో వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు.