న్యూదిల్లీ : : దేశ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా నీటి వనరుల రక్షణ ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని నీటి వనరుల సంరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టును పొదుపు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా జల జీవన్ మిషన్ వంటి వివిధ కార్యక్రమాలతో నీటి సంరక్షణకు ప్రజలకు సురక్షిత మంచి నీటిని అందించడానికి చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా నీటి సంరక్షణ చర్యలు ఒక సామాజిక ఉద్యమంలా సాగుతుండడం హర్షణీయమని అన్నారు. నీటి సంరక్షణ కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, గతంలోని సందేశాలతో కూడిన ఒక వీడియోను తన ట్వీట్కు జతచేశారు.