మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కన్నా యురేనస్, ప్లూటోలపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం విమర్సలు గుప్పించారు. అమెరికా రోదసీ పరిశోధక సంస్థ నాసా ట్వీట్ చేసిన యురేనస్, ప్లూటో, జూపిటర్ చిత్రాలను నిర్మల సీతారామన్ మంగళవారం రీట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చిదంబరం గురువారం ఇచ్చిన ట్వీట్లో, ద్రవ్యోల్బణం 7.01 శాతం, నిరుద్యోగం పెరుగుదల 7.8 శాతం నమోదైన రోజున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జూపిటర్, ప్లూటో, యురేనస్ చిత్రాలను ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఆమెకు తన సొంత నైపుణ్యాలపైనా, తన ఆర్థిక సలహాదారుల నైపుణ్యాలపైనా ఆశలు అడుగంటాయని, అందుకే ఆర్థిక వ్యవస్థను కాపాడాలని గ్రహాలను పిలుస్తున్నారని అన్నారు.ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడును నియమించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు.