కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. చేతబడి వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి పదవికి గల ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని దిగజార్చవద్దని హితవు పలికారు. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేతలు ఈ నెల 5న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు నల్ల దుస్తులు ధరించారు. దీనిపై మోదీ బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కాలా జాదూను నమ్మేవారు ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోలేరని విమర్శించారు. బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. హర్యానాలోని పానిపట్లో రూ.900 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండో తరం ఇథనాల్ ప్లాంట్ను జాతికి అంకితం చేయడం కోసం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడారు. రాహుల్ గాంధీ గురువారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ప్రధాని మోదీ దేశంలోని నిరుద్యోగం, పెరుగుతున్న ధరలను గుర్తించలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. ‘‘మోదీ గారూ, మీ చీకటి పనులను మరుగుపరచడం కోసం చేతబడి వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడటం ద్వారా ప్రధాన మంత్రి పదవికి ఉన్న ఔన్నత్యం, హుందాతనాలను దిగజార్చకండి’’ అని హితవు పలికారు. ప్రజల సమస్యలపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.