వారు ఇంకెంత కాలం నిరీక్షించాలి : వరుణ్గాంధీ అసహనం
న్యూదిల్లీ : ఉద్యోగావకాశాలు లేక దేశ యువత నిరాశ చెందుతోందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లేకపోవడం, ఉపాధి కల్పనకు మార్గాలు సన్నగిల్లుతుండటంతో యువతలో అసహనం, నైరాశ్యం పెరుగుతోందని, వారు ఇంకెంత కాలం ఓపిగ్గా ఉండగలుగుతారని ఆందోళన వ్యక్తంచేశారు. రక్షణ, పోలీసు, రైల్వే, విద్య ఇలా అన్ని ప్రభుత్వ రంగాల్లో గతంలో వలే నియామకాలు జరగడం లేదని అన్నారు. ‘ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉన్నా చాలా పరిమితంగా ఉన్నాయి. ఏదేని అవకాశం వచ్చినా పేపర్ లీక్, స్కామ్లతో పరీక్షలు రద్దు అవుతాయి లేదా ఫలితాలు ఏళ్లు గడిచినా వెలువడవు. రెండేళ్లుగా రైల్వే గ్రూపు డి ఉద్యోగాల కోసం 1.25 కోట్ల మందికిపైగా యువతీయువకులు వేచివున్నారు. ఆర్మీ రిక్య్రూట్మెంట్ పరిస్థితీ ఇదే. వీరు ఇంకెంత కాలం సహనంగా ఉండాలి? అని వరుణ్ ట్వీట్ చేశారు. రెండేళ్లలో ఉత్తరప్రదేశ్ 17 పేపర్లను రద్దు చేసిందని గుర్తుచేశారు. ప్రైవేటు ఉపాధితో ప్రజలను అనుసంధానం చేసే వ్యవస్థ లేనందున ప్రభుత్వ ఉద్యోగాల మార్గదర్శకాలు, షెడ్యూళ్లకు కట్టుబడాలని సూచించారు. ఆర్థిక మందగమనం, ఉద్యోగాల లేమితో పాటు ఇటీవల సాగు చట్టాల విషయంలోనూ అధికార పక్షాన్ని వరుణ్ ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం విదితమే.