బాగ్పట్: వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన యూపీలోని రాజీవ్ తోమర్ (40) అనే వ్యాపారి తన భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వ్యాపారి భార్య చనిపోగా, ఆయన ఆసుపత్రిపాలయ్యాడు. ఫేస్బుక్ లైవ్లో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనమవుతోంది. మోదీ విధానాల వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారంటూ రెండు నిమిషాల వీడియోలో రాజీవ్ తోమర్ ఆరోపించడం, ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లోనూ ఇది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వీడియోలో రాజీవ్ తోమర్ ఒక చిన్న సంచీ (సాచెట్)లోని పదార్ధాన్ని మింగుతుండగా ఆయన భార్య అడ్డుపడిరది. అతన్ని ఉమ్మేయమని శతవిధాలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ‘నాకు మాట్లాడే హక్కు ఉంది. చేసిన రుణాలు చెల్లించాల్సి ఉంది. నేను చనిపోయినా రుణాలు తీరుతాయి. అయితే నా విజ్ఞప్తి ఒక్కటే. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మందికి ఈ వీడియోను షేర్ చేయండి. నేనేమీ జాతి వ్యతిరేకిని కాదు. దేశంపై నాకు నమ్మకం ఉంది. నేను మోదీజీకి ఒకటి చెప్పదలచుకున్నాను. మీరు చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషి కాదు. మీరు మీ విధానాలు మార్చుకోండి’ అని తోమర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన వ్యాపారాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దెబ్బతీసిందన్నారు. కాగా, ఫేస్బుక్ను చూస్తున్న కొందరు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దంపతులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. 38 ఏళ్ల పూనమ్ తోమర్ చికిత్సపొందుతూ కన్నుమూశారు.