మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఉత్కంఠను రేపుతోంది.ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీ కోరడం చట్టవిరుద్ధమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉండగానే అసెంబ్లీలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. గత రెండేండ్లుగా గవర్నర్ వద్ద తమ ప్రభుత్వ ఫైళ్లు పెండిరగ్లో ఉన్నాయని, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని గవర్నర్ ఇప్పుడు రఫేల్ జెట్స్ కంటే వేగంగా వ్యవహరిస్తున్నారని, రాఫెల్ యుద్ధ విమానం కూడా ఇంతకంటే వేగంగా కదలదని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగంతో బీజేపీ, గవర్నర్ చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. తాము ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరతామని స్పష్టం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు టూర్లతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. వారిని గోవా కూడా వెళ్లనివ్వండి..వారు ముంబై తిరిగివచ్చాకే నిర్ణయించవచ్చని వ్యాఖ్యానించారు. ఇక బలపరీక్షకు గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.