సుప్రీం కోర్టు
న్యూదిల్లీ : బాణసంచాను నిషేధించడం ద్వారా ప్రత్యేకించి నిర్ధిష్ట గ్రూపు లేదా సామాజిక వర్గానికి వ్యతిరేకమనే భావనను తొలగించినట్లు సుప్రీం కోర్టు గురువారం తెలిపింది. ఆనందం ముసుగులో పౌరుల హక్కుల ఉల్లంఘనను అనుమతించబోమని పేర్కొంది. తన ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, ఎ.ఎస్.బొప్పన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మీరు(తయారీదారులు) ఆనందించే ముసుగులో పౌరుల జీవితాలతో ఆడుకోవద్దు. మేము ప్రత్యేకించి ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఇక్కడ మేము ఉన్నామని బలమైన సందేశాన్ని పంపించాలని కోరుకుంటున్నాము’ అని బెంచ్ తెలిపింది. కాగా వివరణాత్మకమైన కారణాలను చూపిన తర్వాత ఇంతకుముందు బాణసంచా నిషేధం ఉత్తర్వులను జారీ చేసినట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ‘బాణసంచా మొత్తాన్ని నిషేధించలేదు. ఇది ప్రజాప్రయోజనాలకు సంబంధించింది. దీనిపై ప్రత్యేకించి ఒక ముద్రను వేయకూడదు. ఇది ఒక నిర్ధిష్ట ప్రయోజనం కోసం నిషేధించబడిరదని అంచనా వేయకూడదు. చివరిసారి ఆనందించే మార్గంలో మేము రావడం లేదని చెప్పాము. కానీ ప్రజల ప్రాథమిక హక్కులను మేము అడ్డుకోలేము’ అని బెంచ్ తెలిపింది. ఉత్తర్వులు అమలు చేసే హక్కు ఉన్న అధికారులకు కొంత బాధ్యత అప్పగించాలని పేర్కొంది. ఈరోజు కూడా మార్కెట్లో బహిరంగంగానే బాణసంచా అందుబాటులో ఉందని వివరించింది. ‘ప్రజల హక్కుల పరిరక్షణకు ఇక్కడ మేము ఉన్నామని ఒక సందేశాన్ని మేము ఇవ్వాలని అనుకుంటున్నాము. బాణసంచాను వంద శాతం నిషేధించలేదు. బాణసంచా కాలుష్యం కారణంగా దిల్లీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’ అని పేర్కొంది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు వారిని ఎందుకు శిక్షించకూడదో చెప్పాలని ఆరుగురు తయారీదారులకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఉపాధి ముసుగులో ఇతర పౌరులు జీవించే హక్కును ఉల్లఘించకూడదు. అయితే బాణసంచాపై నిషేధాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, అమాయక పౌరులు జీవించే హక్కుకు ప్రాథమికంగా దృష్టిసారించినట్లు న్యాయస్థానం వివరించింది. కాగా సుప్రీం కోర్టు ఇంతకుముందు బాణసంచా అమ్మకాలపై పూర్తి నిషేధాన్ని తిరస్కరించింది. లైసెన్స్డ్ వ్యాపారుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని, కేవలం గ్రీన్ టపాసుల అమ్మకాలే జరపాలని పేర్కొంటూ. ఆన్లైన్లో బాణసంచా అమ్మకాలపై పూర్తి నిషేధం విధించింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా బాణసంచా అమ్మకాలు, తయారీపై నిషేధం కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్కు స్పందనగా సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.