. మరో 10 మందికి గాయాలు
. షోలాపూర్ ఫ్యాక్టరీలో ఘటన
. నాసిక్లో పాలిథిన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం : ఇద్దరి మృతి
షోలాపూర్: మహారాష్ట్రలోని నూతన సంవత్సరం రోజు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. షోలాపూర్లో బర్షి గ్రామం వద్ద ఒక బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం ఐదుగురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే, సహాయక చర్యలు చేపట్టేందుకు నాలుగు అగ్నిమాపక వాహనాలు, పోలీసులు, సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన నేపథ్యంలో భారీ పేలుడు సంభవించిందని, ఆ సమ యంలో బాణసంచా తయారీలో కనీసం 40 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ప్రమాద స్థలం నుంచి కనీసం 9 మృతదేహాలను వెలికి తీశారని స్థానికులు పేర్కొంటున్నప్పటికీ, అధికారులు మాత్రం దానిని ధ్రువీకరించలేదు. కాగా బర్షి దుర్ఘటనకు కేవలం కొన్ని గంటల ముందు, నాసిక్కు చెందిన ఇగాత్పురి వద్ద జిందాల్ పాలిథిన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.