అందుకు నిరసనగానే రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనలేదు
కాంగ్రెస్
న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించకపోగా బలహీనం చేస్తోందని దేశానికి గుర్తు చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనకుండా నిరసన తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. శుక్రవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ, పార్లమెంటరీ పరిశీలనను దాటవేస్తూ చట్టాలను రూపొందించిన బీజేపీ ప్రభుత్వ నిరంకుశ చర్యలపై నిరసన వ్యక్తం చేశామని అన్నారు. ‘ఈ రోజు మా నిరసన ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంది. రాజ్యాంగాన్ని గౌరవించకపోగా నిర్వీర్యం చేస్తున్నారని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని, పరిశీలనను దాటవేస్తూ చట్టాల అమలుతో అవమానించారని, ఇది అపారమైన సమస్యలను సృష్టిస్తోందని దేశానికి గుర్తు చేయడానికి మేము నిరసన వ్యక్తం చేశాము. ఎందుకంటే, పార్లమెంట్ రూపొందించే ప్రతి చట్టం ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తుంది’ అని ఆయన విలేకరులకు తెలిపారు. కాగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవానికి ఆర్జేడీ, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, శివసేన, డీఎంకే, ఎన్సీపీ, టీఎంసీ, వామపక్ష పార్టీలు సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు హాజరుకాలేదు. ఇదిలాఉండగా, ప్రధాని మోదీపై ఆనంద్ శర్మ విమర్శల దాడి చేస్తూ, ఆయన దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారి జ్ఞాపకాలను తుడిచిపెట్టాలనుకుంటున్నాడని, చరిత్రను మార్చాలని కోరుకుంటున్నాడని తెలిపారు. ‘మహాత్మా గాంధీ నేతృత్వంలోని జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమీ లేదు. నాయకులందరూ కాంగ్రెస్ వారే. ఈ నేతల కోసం బీజేపీ వెతుకులాట సాగిస్తోంది’ అని అన్నారు. ‘భారతదేశానికి భిన్నత్వం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం పని చేసే జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రధాన మంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇతర పార్టీలకు ఉపన్యాసాలు ఇవ్వకూడదు’ అని విమర్శించారు. ఎన్నికల సంఘం తన పనిని ఇలాగే కొనసాగిస్తే మంచిదని పేర్కొంటూ, మోదీ ప్రధాని అయ్యేంత వరకు 1947 నుండి 2014 వరకు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉండిఉంటే, రాజ్యాంగాన్ని గౌరవించకపోతే, 2014లో స్వేచ్ఛగా, నిష్ఫక్షపాతంగా జరిగిన ఎన్నికల ద్వారా మోదీ ప్రధాని కాలేకపోయేవారు. ఎందుకంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం వృద్ధి చెందింది’ అని తెలిపారు. మోదీ, ఆయన సహచరులు ప్రతిపక్షాలను విమర్శించడం సరికాదని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎందుకు చర్యలు తీసుకున్నారో వారు వివరించాలని ఆనంద్ శర్మ కోరారు. బీజేపీ ప్రభుత్వ పని తీరును, దాని నిరంకుశ ధోరణిని వ్యతిరేకించాలని సమష్టిగా నిర్ణయించుకున్న భావసారూప్యత కలిగిన పార్టీలతో సమన్వయం చేసుకోవాలని కాంగ్రెస్ తెలివైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.