లక్నో : దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పే అబద్ధాలకు అన్నదాతలు బలి అవుతున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బుధవారం విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లాలో అప్పుల భారాన్ని మోయలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం హృదయవిదారకమని అన్నారు. 45 ఏళ్ల చౌదరీ అనిల్ కుమార్ బాగ్పట్లోని బిహారిపూర్ గ్రామంలో మంగళవారం పక్కవారి పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తీసుకున్న అప్పును ఎలా చెల్లించాలో తెలియక ఆయన మానసికంగా కుంగిపోయి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నారని మృతుడి బంధువులు తెలిపారు. ఈ ఘటనపై అఖిలేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ పాలనలో రైతులు ఇంతటి దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, కాషాయ ప్రభుత్వం చెప్పే అబద్ధాలకు బలి అవుతున్నారని దుయ్యబట్టారు. రైతులు ఇంకెంత కాలం ఇదంతా భరించగలరని ప్రశ్నించారు. బీజేపీ అక్కర్లేదన్న హ్యాష్ట్యాగ్తో హిందీలో ట్వీట్ చేశారు. బ్యాంకు నుంచి రూ.7లక్షలు , స్థానిక వడ్డీ వ్యాపారి నుంచి మరో రూ.3లక్షల అప్పు చేసిన చౌదరి వాటిని ఎలా చెల్లించాలో తెలియక త్మహత్యను శరణ్యంగా భావించినట్లు అతని బంధువులు తెలిపారు. మానసిక ఒత్తిడికి లోన్నట్లు తెలిసిందిగానీ అప్పు గురించి తెలియలేదని కోట్వాలి పోలీసు స్టేషన్ ఇంచార్జి అజయ్ కుమార్ శర్మ అన్నారు. ఇదిలావుంటే లఖింపూర్ కిసాన్ స్మృతి దివస్ సందర్భంగా దీపాలు వెలిగించి అమరరైతులకు నివాళులర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రజలను, రైతుల శ్రేయోభిలాషులను, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలను, మిత్రపక్షాలను అఖిలేశ్ యాదవ్ వేరొక ట్వీట్లో కోరారు.