గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. గురువారం మొత్తం 160 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో భారత క్రికెట్ జట్టు ఆటగాడు రవీందర్ జడేజా భార్య రివాబా సోలంకి పేరు కూడా ఉంది. ఆమెకు ఉత్తర జామ్నగర్ సీటును బీజేపీ కేటాయించింది. జడేజా భార్య రివాబా మూడేళ్ల కిందటే బీజేపీలో చేరారు. కర్ణిసేనలో యాక్టివ్గా పనిచేసిన రివాబా.. కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి దగ్గర బంధువు. ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన పాటీదార్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్కు సీటు దక్కింది. ఆయన విరామ్గమ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నుంచి, హోం మంత్రి హర్ష్ సంఫ్వీు మజురా నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలి దశలో 89, డిసెంబరు 5న చివరి దశలో 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై.. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ సీఎం, బీజేపీ చీఫ్లతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.