న్యూదిల్లీ : దేశంలో బీజేపీ అనేక ద్వేషపూరిత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ విరుచుకుపడ్డారు. ద్వేషపూరిత ఫ్యాక్టరీల్లో ‘టెక్ ఫాగ్’ యాప్ ఒకటని అన్నారు. ఒక నిర్దిష్ట మతానికి చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకున్న బుల్లీబాయ్ యాప్ కేసులో నిందితుల వయస్సును బట్టి ఇంత ద్వేషం ఎక్కడి నుంచి వస్తోందని దేశం మొత్తం ఆశ్చర్యపోతోందని ఆయన అన్నారు. నిజానికి బీజేపీ అనేక విద్వేషాల ఫ్యాక్టరీలను నెలకొల్పిందని, అందులో టెక్ ఫాగ్ కూడా ఒకటి అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. ‘టెక్ ఫాగ్’ అనేది బీజేపీకి ఉపయోగపడే యాప్, ఇది సామాజిక మాధ్యమాల్లో ద్వేషం, వైరాన్ని వ్యాపింపజేయడానికి సైబర్ ఆర్మీకి శక్తిని అందించిందని రాహుల్ పేర్కొంటూ ఒక నివేదికను తన ట్వీట్కు జత చేశారు. ఈ యాప్పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేసింది. జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది.