ఆ సమయంలో కాన్వాయ్లో లేని నితీశ్ కుమార్
13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కాన్వాయ్పై పాట్నాలో రాళ్ల దాడికి సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా ఏఎస్స్పీ తెలిపారు. ఆదివారం పాట్నా- గయ మార్గంలో గౌరీచక్లోని సోహ్గి గ్రామంలో ఆందోళనకారులు మూకుమ్మడి దాడికి దిగడంతో సీఎం కాన్వాయ్కి చెందిన మూడు, నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్లో లేరు. అయితే, భద్రతా సిబ్బంది కార్లలో ఉన్నారు. సోమవారం సీఎం పర్యటన కోసం ఆదివారం సాయంత్రం కాన్వాయ్ను గయకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బీహార్ సీఎం హెలికాప్టర్లో గయకు చేరుకోవాల్సి ఉంది. ఆయన భద్రతలో భాగమైన వాహనాలు ఒక రోజు ముందుగానే వెళ్లాయి. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు-మూడు రోజులుగా కనిపించకుండాపోయిన యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కోపోద్రిక్తులైన ఆందోళన కారులు పాట్నా- గయ రహదారిని దిగ్బంధించారు. ఈ క్రమంలో సీఎం కాన్వాయ్ కనిపించడంతో దానిపై రాళ్ల దాడి చేశారు. వెంటనే పోలీసు బలగాలను ఆ ప్రాంతానికి పంపించి, గుంపును చెదరగొట్టారని ఆయన చెప్పాడు. 15 మందిపై కేసు నమోదు చేయగా, వారిలో 13 మందిని అరెస్టు చేశారు.