న్యూదిల్లీ: పారిశ్రామిక అవసరాల కోసం ఆరు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల కోసం ఎన్టీపీసీ నుంచి ఆర్డర్ను అందుకున్నట్లు ప్రభుత్వరంగంలోని బీహెచ్ఈఎల్ సోమవారం తెలిపింది. ఉత్తరప్రదేశ్ రaాన్సీలోని కంపెనీ యూనిట్లో ఈ లోకోమోటివ్లను తయారు చేయనున్నారు. లోకోమోటివ్ల కోసం ట్రాక్షన్ మోటార్లను భోపాల్ ప్లాంట్ నుంచి సరఫరా అవుతాయని, ఐజీబీటీ (ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్) ఆధారిత ప్రొపల్షన్ పరికరాలను బెంగళూరు యూనిట్ అభివృద్ధి చేసి సరఫరా చేస్తుందని బీహెచ్ఈఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశంలోనే తొలిసారిగా పారిశ్రామిక అవసరాల కోసం 6000 హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల కోసం ఆర్డర్ను పొందడం ద్వారా రోలింగ్ స్టాక్ వ్యాపారంలో బీహెచ్ఈఎల్ ప్రధాన పురోగతిని సాధించింది’ అని ప్రకటన వివరించింది. ఛత్తీస్గఢ్లోని లారా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సైట్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ కార్యకలాపాల కోసం ఆరు 6,000 హెచ్పి ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను సరఫరా చేయడానికి ఎన్టీపీసీ ఆర్డర్ చేసిందని తెలిపింది.